Published on Feb 23, 2023
Daily Current Affairs in Telugu: 23rd ఫిబ్రవరి 2023
Daily Current Affairs in Telugu: 23rd ఫిబ్రవరి 2023

Earthquake: తజకిస్తాన్‌లో 6.8 తీవ్రతతో భారీ భూకంపం..
తూర్పు తజకిస్తాన్‌లో ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ (గురువారం) రిక్టార్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్, చైనా సరిహద్దుల్లోని గోర్నో-బదక్షన్‌లో భూకంపం వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.37 గంటలకు, భూ ఉపరితం నుంచి 20.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం వచ్చిన మ‌రో 20 నిమిషాల తరువాత 5.0 తీవ్రతో మరో భూకంపం వచ్చింది. తక్కువ జనాభా కలిగి ఉన్న పామిర్ పర్వత ప్రాంతాల్లో భూకంపం రావడం వల్ల పెద్దగా నష్టం కలగలేదు.

Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష బరిలో ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామి
భారతీయ మూలాలున్న అమె రికన్‌ యువ పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి ఆ దేశ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన భారతీయ మూలాలున్న రెండో భారతీయుడు వివేక్‌. 37 ఏళ్ల వివేక్‌ తల్లిదండ్రులు గతంలో కేరళ నుంచి అమెరికాకు వలసవచ్చారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు పోటీగా దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఇటీవలే పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్లు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టారు. 
‘ అమెరికాను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషిచేస్తా. అంతకుముందు మనం అమెరికా గొప్పదనాన్ని మరోసారి పునశ్చరణ చేసుకుందాం. చైనా ఆధిపత్యం వంటి సవాళ్లను అమెరికా ఎదుర్కొంటోంది. అమెరికా సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తోంది. ఒక వేళ రష్యా నిఘా బెలూన్‌ వచ్చి ఉంటే కూల్చి వెంటనే ఆంక్షలు విధించేవాళ్లం. చైనా విషయంలో ఆంక్షలు ఎందుకు విధించలేకపోయాం?. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఉత్పత్తుల కోసం చైనాపై మనం అంతలా ఆధారపడ్డాం. ఆర్థికంగా ఇలా మరో దేశంపై ఆధారపడే పరిస్థితికి చరమగీతం పాడదాం’ అని ఫాక్స్‌న్యూస్‌ ప్రైమ్‌టైమ్‌ షో సందర్భంగా వివేక్‌ వ్యాఖ్యానించారు. 

Shelly Oberoi: ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ 
ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ) మేయర్‌ ఎన్నికలు ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ సజావుగా జ‌రిగాయి. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై ఆప్‌ మహిళా అభ్యర్థి షెల్లీ ఓబెరాయ్‌ 34 ఓట్ల తేడాతో నెగ్గి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. 266 ఓట్లు పోలవగా షెల్లీకి 150, గుప్తాకు 116 ఓట్లు దక్కాయి. నామినేటెడ్‌ సభ్యులకూ ఓటింగ్‌ హక్కు ఉందంటూ బీజేపీ కార్పొరేటర్లు వాదించడం, అందుకు ఒప్పుకునేది లేదంటూ మెజారిటీ సభ్యులైన ఆప్‌ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగడంతో ఢిల్లీలోని సివిక్‌ సెంటర్‌ భవనంలో మేయర్, డెప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ గతంలో మూడుసార్లు అర్ధంతరంగా వాయిదాపడింది. 

మేయర్‌ ఎన్నికలపై తేల్చాలంటూ ఆప్‌ అభ్యర్థి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) వీకే సక్సేనా నామినేట్‌ చేసిన సభ్యులకు ఓటింగ్‌ హక్కులు ఉండబోమని సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17న తేల్చిచెప్పడంతో మేయర్‌ ఎన్నిక కోసం సభను సమావేశపరచాలని ఎల్‌జీ ఆదేశాలివ్వడం, ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్థి జయకేతనం ఎగరేయడం చకచకా జరిగిపోయాయి. డెప్యూటీ మేయర్‌గా ఆప్‌ అభ్యర్థి అలే మొహమ్మద్‌ ఇక్బాల్‌ గెలిచారు. ఎంసీడీ తొలి మేయర్‌గా ఎన్నికైన 39 ఏళ్ల షెల్లీ ఆప్‌ మహిళా అభ్యర్థిగా తూర్పు పటేల్‌నగర్‌ వార్డు నుంచి గెలిచారు. గతంలో ఈమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఇగ్నోలో డాక్టరేట్‌ చేశారు. ఇండియన్‌ కామర్స్‌ అసోసియేషన్‌(ఐసీఏ)లో బంగారు పతకం సాధించారు.  

Caste Discrimination: కులవివక్షను నిషేధించిన సియాటిల్‌ 
కులవివక్షను నిషేధిస్తూ అమెరికాలోని సియాటిల్‌ నగరం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అగ్ర రాజ్యంలో ఈ చర్య తీసుకున్న తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నేత, ఆర్థికవేత్త క్షమా సావంత్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్‌ భారీ మెజారిటీతో ఆమోదించింది. నగర వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని కూడా జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా సావంత్ ‘‘అమెరికాలో కులవివక్షపై పోరాటంలో ఇదో కీలక ముందడుగు. ఇక దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేలా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముంది’’ అని అభిప్రాయపడ్డారు. ఇది చరిత్మాత్మక నిర్ణయమని సియాటిల్‌ టైమ్స్‌ వార్తా పత్రిక కొనియాడింది. 
‘‘ఈ రోజు కోసం హత్య, అత్యాచార బెదిరింపులెన్నింటినో తట్టుకుంటూ ముందుకు సాగాం. అంతిమంగా ద్వేషంపై ప్రేమ గెలిచింది’’ అని తాజా నిర్ణయం వెనక కీలకంగా వ్యవహరించిన ఈక్వాలిటీ ల్యాబ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. భారత్‌లో కులవివక్షను 1948లో నిషేధించారు. 1950లో రాజ్యాంగంలో పొందుపరిచారు. 2018 అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే ప్రకారం అక్కడ ఉంటున్న భారత సంతతి వ్యక్తుల సంఖ్య 42 లక్షల పై చిలుకే. అమెరికా ఎప్పుడూ కులవ్యవస్థను అధికారికంగా గుర్తించకపోయినా అక్కడి దక్షిణాసియావాసులు ఉన్నత విద్యా సంస్థల్లో, పనిచేసే చోట కులవివక్షను ఎదుర్కొన్న ఉదంతాలెన్నో ఉన్నాయి.

Russia-Ukraine War: ఒక దురాక్రమణకు తలవంచని తెగువకు ఏడాది 
ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేని రోజు 2022 ఫిబ్రవరి 24. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిన రోజు. రష్యా అపార సాయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్‌ నిలవలేదని, దాని ఓటమితో రోజుల వ్యవధిలోనే యుద్ధం ముగుస్తుందని అంతా భావించారు. 
దాదాపు ఏడాది గడిచాక.. 
పసికూనగా భావించిన ఉక్రెయిన్‌ పట్టువీడకుండా తెగించి పోరాడుతూనే ఉంది. పాశ్చాత్య దేశాల సాయుధ, ఆర్థిక సాయం దన్నుతో రష్యాను దీటుగా ఎదిరిస్తోంది. పలు ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యా సేనలను తరిమికొడుతూ మరిచిపోలేని పరాభవాలను పుతిన్‌కు రుచి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఎంతకాలమైనా ఉక్రెయిన్‌కు మద్దతిస్తూనే ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంత దూరమైనా వెళ్తామంటూ పుతిన్‌ చేసుకున్న తాజా హెచ్చరికలు దీన్ని మరింత బలపరుస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యాలనే గాక ప్రపంచ దేశాలన్నింటినీ యుద్ధం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఐరోపా ఖండంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఘర్షణ కూడా ఇదే. 
తొలిసారేమీ కాదు..

ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణలు ఇదే తొలిసారేమీ కాదు. వెయ్యేళ్ల చరిత్ర, 4.4 కోట్ల జనాభా ఉన్న ఉక్రెయిన్‌ ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌(యూఎస్‌ఎస్‌ఆర్‌)లో అంతర్భాగమే. సోవియట్‌ పతనానంతరం 1990ల్లో స్వతంత్ర దేశంగా అవతరించింది. పశ్చిమ దేశాల కుట్రల వల్లే ఉక్రెయిన్‌ తమకు దూరమైందని రష్యా ద్వేషం పెంచుకుంది. పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్‌ కీలుబొమ్మ అని పుతిన్‌ తరచుగా విమర్శిస్తుంటారు. ఉక్రెయిన్‌ కృత్రిమంగా ఏర్పడ్డ దేశమని, నిజానికి అది, రష్యా ఒకే తల్లి బిడ్డలని ఆయన వాదిస్తుంటారు. రెండు దేశాలను ఎలాగైనా ఒక్కటి చేయాలన్నదే పుతిన్‌ ఆశయం. అందులో భాగంగానే 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించింది. ఆ ఘర్షణలో ఇరువైపులా వేలాది మంది మరణించారు.

Shooting World Cup: ప్రపంచకప్‌ షూటింగ్ టోర్నీలో ప్రతాప్‌ సింగ్‌కు స్వర్ణం 
ప్రపంచకప్‌ షూటింగ్ టోర్నీలో భారత్‌ ఖాతాలో నాలుగో స్వర్ణ పతకం చేరింది. ఫిబ్ర‌వ‌రి 23న‌ జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ పసిడి పతకం సాధించాడు. ఫైనల్లో 22 ఏళ్ల ప్రతాప్‌ సింగ్‌ 16–6తో అలెగ్జాండర్‌ షిమిర్ల్‌ (ఆ్రస్టియా)పై గెలుపొందాడు. ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్‌ రౌండ్‌లో షిమిర్ల్, ప్రతాప్‌ సింగ్‌ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌ చేరారు. భారత్‌కే చెందిన అఖిల్‌ షెరాన్‌ ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ రిథమ్‌ సాంగ్వాన్‌ రెండో ర్యాంకింగ్‌ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.